పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత... హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స

  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స
  • అధికారులతో సమావేశంలో అస్వస్థతకు గురైన పవన్
  • వారం నుంచి పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
  • పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వెల్లడి
  • పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షించిన వైద్యులు, శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించి విజయవంతంగా పూర్తి చేశారు.

వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు తెలిపారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి గణనీయమైన సమయం పడుతుందని, దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాలను జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

కాగా, పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan
Surgery
Illness
Janasena
Deputy CM
Andhra Pradesh

More Telugu News